చైనా తీరుపై మోదీ అసంతృప్తితో ఉన్నారు : ట్రంప్
ABN , First Publish Date - 2020-05-29T17:25:30+05:30 IST
భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ..

భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చైనా తీరుపై మోదీ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. భారత్-చైనా మధ్య పెద్ద ఘర్షణ తలెత్తినట్లు వ్యాఖ్యానించారు. రెండు దేశాలు అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యవస్థలు కలిగి ఉన్నాయని చెప్పారు. ఇటు చైనా గానీ, అటు భారత్ గానీ తాజా పరిస్థితులపై సంతోషంగా లేవనుకుంటా..! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్లోని పాంగాంగ్త్సో, గాల్వాన్ లోయ, డెమ్చోక్, దౌలత్బెగ్ ఓల్దీ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం పెద్ద ఎత్తున తిష్ట వేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన భారత్ చైనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాలకు సైన్యాన్ని తరలించినట్లు సమాచారం. దాదాపు 20 రోజుల నుంచి తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలిసింది. చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే భారత్ గస్తీ పెంచింది. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాలకు ఇరు దేశాలు తమ బలగాలను పంపుతున్నాయి. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన అనంతరం మళ్లీ ఇప్పుడు లద్దాక్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశా ల మధ్య తిరిగి అటువంటి పరిస్థితులే చోటుచేసుకునే అవకాశం ఉంది.