పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపు
ABN , First Publish Date - 2020-12-19T18:48:37+05:30 IST
మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని విధాలుగా

న్యూఢిల్లీ : మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మన దేశాభివృద్ధికి టాటా గ్రూప్ గొప్ప కృషి చేసిందని ప్రశంసించారు. అసోచామ్ ఫౌండేషన్ వీక్, 2020 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ‘‘ఇండియాస్ రెజిలియెన్స్ : ఆత్మనిర్భర్ రోడ్మ్యాప్ టువార్డ్స్ యూఎస్డీ 5 ట్రిలియన్ ఎకానమీ’’ అనే థీమ్తో ఈ కార్యక్రమం జరిగింది.
గడచిన వందేళ్ళలో అసోచామ్, టాటా గ్రూప్ మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గొప్పగా కృషి చేశాయని, తద్వారా సామాన్య భారతీయులకు సహాయపడ్డాయని ప్రశంసించారు. రతన్ టాటా దేశం కోసం విశేష కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచం 4వ పారిశ్రామిక విప్లవం దిశగా దూసుకెళ్తోందన్నారు. నూతన టెక్నాలజీ వల్ల సవాళ్లతోపాటు పరిష్కారాలు కూడా వస్తాయన్నారు. ఇది ప్రణాళికలు రచించుకోవడంతోపాటు పని చేయవలసిన సమయమని తెలిపారు. మనం ప్రతి చర్యను భారీ లక్ష్యమైన దేశ నిర్మాణానికి ముడిపెట్టాలన్నారు.
మన లక్ష్యం కేవలం స్వయం సమృద్ధి సాధించడం మాత్రమే కాదని, సాధ్యమైనంత త్వరగా స్వయం సమృద్ధి సాధించడమని చెప్పారు. ప్రపంచంపట్ల భారత దేశానికిగల పాజిటివిటీ సమున్నత స్థాయిలో ఉందని, ఇది 130 కోట్ల మంది భారతీయుల ఆత్మ విశ్వాసం నుంచి వచ్చిందని చెప్పారు. భారత దేశం నూతనోత్తేజంతో ముందుకెళ్తోందన్నారు.