తప్పుదోవ పట్టించడం నాయకత్వ లక్షణం కాదు
ABN , First Publish Date - 2020-06-23T07:17:16+05:30 IST
చైనాతో గల్వాన్ వివాదం విషయంలో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ విమర్శల దాడి కొనసాగిస్తోంది. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతోంది...

- చైనాతో వివాదంపై మన్మోహన్ సింగ్
- ప్రధాని మోదీపై విమర్శల వర్షం
న్యూఢిల్లీ, జూన్ 22: చైనాతో గల్వాన్ వివాదం విషయంలో ప్రధాని మోదీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ విమర్శల దాడి కొనసాగిస్తోంది. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతోంది. భారత భూభాగంలో ఎవరూ అడుగు పెట్టలేదని, అడుగు పెట్టబోరని ఆ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో గల్వాన్లో ఘర్షణకు తాము కారణం కాదని తేలిపోయిందంటూ చైనా వెంటనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శల దూకుడును పెంచింది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తొలిసారిగా అంశంపై స్పందిస్తూ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తప్పుదోవ పట్టించడం నాయకత్వ లక్షణం కాదన్నారు. ప్రధాని తాను మాట్లాడే అంశాలతో ఎదురయ్యే చిక్కులను కూడా గుర్తుంచుకోవాలన్నారు. దౌత్యపరంగా ఏం చేయబోతున్న విషయంపై స్పష్టత కలిగి ఉండాలన్నారు. భారత సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.