కేంద్రం అభ్యంతరాలపై స్పందించిన పతంజలి

ABN , First Publish Date - 2020-06-24T03:13:08+05:30 IST

హరిద్వార్: కరోనాకు మందు కనుగొన్నామంటూ పతంజలి చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ...

కేంద్రం అభ్యంతరాలపై స్పందించిన పతంజలి

హరిద్వార్: కరోనాకు మందు కనుగొన్నామంటూ పతంజలి చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమాచారలోపం తలెత్తిందని చెప్పారు. తాము వంద శాతం ప్రమాణాలు పాటిస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామన్నారు. తాము చేసిన ప్రయోగాలు, అధ్యయనాలు, ఇతర వివరాలను కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖకు అందజేశామని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. 




కరోనాకు తాము మందు కనుగొన్నామని పతంజలి ప్రకటించగానే ఆయుష్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ప్రచారాన్ని ఆపాలని సూచించింది. పతంజలి చేసిన ప్రయోగాలకు సంబంధించిన శాంపిల్ సైజ్, ప్రాంతాలు, ఆసుపత్రుల వివరాలు అందించాలని కోరింది.  


అంతకుముందు హరిద్వార్‌లో ఈ మధ్యాహ్నం బాబా రాందేవ్ కరోనిల్ అనే టాబ్లెట్లను విడుదల చేశారు. జైపూర్ నిమ్స్ వైద్యులు, శాస్త్రవేత్తల సహకారంతో తయారుచేసిన ఈ మాత్ర ఏడు రోజుల్లోనే కరోనా పూర్తిగా నయమౌతుందని చెప్పారు. 150 ఔషధ మొక్కలతో ఈ మందు తయారు చేశామన్నారు. వందల మందిపై ప్రయోగం చేశామని, ఒక్కరూ చనిపోలేదని, అందరూ కోలుకున్నారని రాందేవ్ చెప్పారు. వచ్చే సోమవారం నుంచి యాప్ ద్వారా అమ్మకాలు జరపనున్నామని తెలిపారు. 

Updated Date - 2020-06-24T03:13:08+05:30 IST