బిహార్ భవన్ వద్ద వలస కూలీల పడిగాపులు
ABN , First Publish Date - 2020-05-09T20:48:19+05:30 IST
దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల వలస కూలీలు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల వలస కూలీలు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. వారికి సహాయపడటం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ ఫోన్ నంబర్లు కూడా సక్రమంగా వారికి ఉపయోగపడటం లేదు. దీంతో వందలాది మంది వలస కూలీలు బిహార్ భవన్కు చేరుకున్నారు. తమకు సాయమందించాలని వేడుకుంటున్నారు.
అష్ట దిగ్బంధనం అమలవుతున్న సమయంలో ఇళ్ళ అద్దెలు అడగవద్దని ఇళ్ళ యజమానులను ప్రభుత్వం కోరినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. తమ ఇళ్ళ యజమానులు తమను ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, ఇంటి అద్దె చెల్లించకపోతే, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వలస కూలీలు చెప్తున్నారు. తమకు పనులు లేకపోవడం వల్ల ఆదాయం లేదని, అందువల్ల తాము ఇళ్ళ అద్దెలు చెల్లించలేకపోతున్నామని చెప్తున్నారు. తాము 15 రోజుల నుంచి హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేస్తున్నప్పటికీ, తమకు ఎవరూ సహాయపడటం లేదని వాపోతున్నారు. ఇటువంటి సమయంలో తమకు సహాయపడకపోతే, ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ఉండటం దేనికని ప్రశ్నిస్తున్నారు.
తాము రోజంతా డయల్ చేసినా ఈ హెల్ప్లైన్ నంబరు పనిచేయడం లేదని, బిజీ అని సందేశం వస్తోందని కొందరు వలస కూలీలు తెలిపారు. ఓ వలస కూలీ మాట్లాడుతూ, తనకు ఈ హెల్ప్లైన్ ఎట్టకేలకు కనెక్ట్ అయిందని, తన పేరు, వివరాలు రాసుకున్నారని, అయితే తదుపరి చర్యల గురించి మరోసారి ఫోన్ చేసినపుడు, అక్కడి అధికారి దురుసుగా మాట్లాడారని, ‘మేం నీ కోసం ఇక్కడ కూర్చోలేదు’ అంటూ కసురుకున్నారని చెప్పారు. ఇక చేసేదేమీ లేక తాను తన స్వస్థలానికి వెళ్ళిపోవాలనుకుంటున్నానన్నారు.