నా బాత్రూమ్లో కెమెరాలు పెట్టారు : మరియం నవాజ్
ABN , First Publish Date - 2020-11-13T17:50:59+05:30 IST
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. తనను నిర్బంధించిన జైలు గదిలోనూ, బాత్రూమ్లోనూ అధికారులు కెమెరాలను అమర్చారని ఆరోపించారు. ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జైలులో ఉన్నపుడు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
చౌదరి సుగర్ మిల్స్ కేసులో గత ఏడాది మరియం నవాజ్ షరీఫ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. తాను జైలులో ఎదుర్కొన్న కష్టాలను ఆమె వివరించారు. తాను రెండుసార్లు జైలు జీవితం గడిపినట్లు ఆమె తెలిపారు. ఓ మహిళనైన తనను జైలులో ఏ విధంగా చూశారో తాను చెబితే, ప్రభుత్వం ముఖం చూపించే సాహసం చేయదన్నారు.
ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై మండిపడుతూ, అధికారులు తన గదిలోకి బలవంతంగా చొచ్చుకొచ్చి, తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్టు చేసి, వ్యక్తిగతంగా దాడి చేస్తే, ఇక పాకిస్థాన్లో ఏ మహిళకూ రక్షణ ఉండదన్నారు. మహిళలు పాకిస్థాన్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా బలహీనులు కాదన్నారు.
రాజ్యాంగం పరిథిలో సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ సిద్దమేనన్నారు. వ్యవస్థల పట్ల తమకు వ్యతిరేకత లేదని చెప్పారు. పాకిస్థాన్ డెమొక్రాటిక్ మువ్మెంట్ వేదికపై చర్చలకు సిద్ధమేనని తెలిపారు.
మరియం నవాజ్ షరీఫ్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు.