మాస్క్లు ఇస్తానంటూ మహిళా వ్యాపారిని మోసగించిన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-06-03T02:55:07+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే
అహ్మదాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఉపయోగించే మాస్క్లను అమ్ముతానని మోసగించిన వ్యక్తిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రెండు లక్షల మాస్క్లను అమ్మేందుకు ఓ మహిళా వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకుని, ఆ వ్యక్తి ఆమెను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నగరానికి చెందిన మహిళా వ్యాపారవేత్త మనాలీ సేఠ్ వద్దకు నగరంలోని ఘట్లోడియా ప్రాంతంలో నివసిస్తున్న భట్ వెళ్ళాడు. రూ.24 లక్షలు చెల్లిస్తే 2 లక్షల మాస్క్లు అందజేస్తానని చెప్పాడు. తన కార్యాలయం ఢల్లీ దర్వాజా వద్ద ఉందని చెప్పాడు.
మార్చి 5న మనాలీ సేఠ్ ఢిల్లీ దర్వాజాలోని భట్ కార్యాలయానికి వెళ్ళి, రూ.17.5 లక్షలు డిపాజిట్ చేశారు. కానీ భట్ మాస్క్లను సరఫరా చేయలేదు. అతని సెల్ఫోన్ స్విచాఫ్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత మార్చి 21న మనాలీ ఆయన కార్యాలయానికి వెళ్ళి చూడగా, అది అతని కార్యాలయం కాదని, మోసం జరిగిందని తెలుసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు భట్పై ఐపీసీ సెక్షన్లు 420, 406, 409 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.