యూట్యూబ్ చూసి శానిటైజర్ కంపెనీ!
ABN , First Publish Date - 2020-08-10T07:48:22+05:30 IST
ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్...
- పోలీసుల అదుపులో ‘పర్ఫెక్ట్’ యజమాని సహా ఐదుగురు
- కురిచేడు శానిటైజర్ మరణాల కేసు కొలిక్కి
కురిచేడు, ఆగస్టు 9: ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్ మరణాల కేసు కొలిక్కి వచ్చింది. దీంతో సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్, ముడి సరుకు అందజేసిన ఇద్దరు మార్వాడీలు, హైదరాబాద్లో డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న మరో ఇద్దరు ఉన్నారు. వారిని హైదరాబాద్ నుంచి ఆదివారం తెల్లవారు జామున కురిచేడుకు తీసుకువచ్చారు. ఒకట్రెండ్రోజుల్లో కోర్టులో హాజరుపరిచే అవకాశముది. హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ యజమాని శ్రీనివాస్ మూడో తరగతి మాత్రమే చదివాడు. ప్రారంభంలో ఓ కిరాణా షాపులో పనిచేశాడు. తరువాత పర్ఫెక్ట్ కిరాణా మర్చంట్స్ పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపాడు. లాక్డౌన్ సమయంలో శానిటైజర్లు, మాస్క్లు అమ్మకాలు చేశాడు. వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్లో చూసి ఆ విధానంలో ఎలాంటి అనుమతులు లేకుండా శానిటైజర్ తయారు చేయడం ప్రారంభించాడు. శానిటైజర్ తయారీలో ఇథైల్ ఆల్కహాల్తో పాటు మిథైల్ క్లోరైడ్ను వినియోగించడమే శ్రీనివాస్ చేసిన పెద్ద తప్పు. 16 మంది మృత్యువాత పడటానికి అదే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.