అలీగఢ్లో దారుణం.. కరోనా క్యారియర్ అంటూ యువకుడిని చితకబాదిన వైనం!
ABN , First Publish Date - 2020-05-10T03:22:52+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో దారుణం జరిగింది. కరోనాను వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ 25 ఏళ్ల
![అలీగఢ్లో దారుణం.. కరోనా క్యారియర్ అంటూ యువకుడిని చితకబాదిన వైనం!](https://media.andhrajyothy.com/appimg/galleries/202005090949274/05092020215114n63.jpg)
అలీగఢ్: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో దారుణం జరిగింది. కరోనాను వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ 25 ఏళ్ల యువకుడిని కొందరు చితకబాదారు. ఓ మెడికల్ షాపుకు వచ్చిన బాధితుడు అబ్దుల్ సమద్ను ‘కరోనా క్యారియర్’గా అనుమానించి ఈడ్చిపడేసి విచక్షణ రహితంగా దాడిచేశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు స్పృహ కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బాధితుడిని అతడి కుటుంబ సభ్యులు వెంటనే మల్కాన్ సింగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
రంజాన్ ఉపవాసం కారణంగా తన కుమారుడు అస్వస్థతకు గురయ్యాడని సమద్ తండ్రి లైఖర్ రెహ్మాన్ తెలిపారు. దీంతో మందులు కొనుక్కునేందుకు సమీపంలోనే ఉన్న మందుల దుకాణానికి వెళ్లినట్టు చెప్పారు. కొందరు అతడిని చూసి అనుమానించి దాడిచేశారని పేర్కొన్నారు. వారి దాడిలో సమద్ తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం సమద్ ప్రాణాపాయం నుంచి బయపడ్డాడని, కొన్ని పరీక్షల కోసం జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు.