గాంధీపై లేని గౌరవం ఠాగూర్‌పై ఉంటుందా?: బీజేపీపై మమత ఫైర్

ABN , First Publish Date - 2020-12-29T22:00:27+05:30 IST

విశ్వభారతి విశ్వవిద్యాలయ సంస్కృతిని బీజేపీ నాశనం చేస్తోంది. విశ్వభారతి చుట్టూ ఇలాంటి రాజకీయాలు నడుస్తుండడం నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. విశ్వభారతి వైస్ ఛాన్స్‌లర్ బీజేపీకి చెందిన వ్యక్తే. మతవిధ్వేష రాజకీయాలకు

గాంధీపై లేని గౌరవం ఠాగూర్‌పై ఉంటుందా?: బీజేపీపై మమత ఫైర్

కోల్‌కతా: భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొద్ది రోజుల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన పట్టణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు టీఎంసీ నేతలు బీజేపీలో చేరారు. దీనిపై మమతా తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేల్ని కొనగలరేమో కానీ, తమ పార్టీని కొనలేరని బీజేపీని మమతా బెనర్జీ హెచ్చరించారు.


‘‘బెంగాల్ సంస్కృతిని నాశనం చేసే కుట్రలు జరుగుతున్నాయి. హింసావాద, విభజనవాద రాజకీయాలు ఆపండి. మహాత్ముడిని గౌరవించని వారు ఈరోజు ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) అంటూ మోసగించాలని చూస్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కొద్ది దశాబ్దాల క్రితమే బెంగాల్‌ను సోనార్ బంగ్లాగా మార్చారు. ఇప్పుడు చేయాల్సిందల్లా బీజేపీ లాంటి మతతత్వ శక్తుల నుంచి ఆ సోనార్ బంగ్లాను కాపాడుకోవడమే’’ అని మమతా బెనర్జీ అన్నారు.


విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలపై బీజేపీ కక్ష కట్టిందని ఆదివారం విమర్శించిన మమతా.. ఈ రోజు అదే విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ.. ‘‘విశ్వభారతి విశ్వవిద్యాలయ సంస్కృతిని బీజేపీ నాశనం చేస్తోంది. విశ్వభారతి చుట్టూ ఇలాంటి రాజకీయాలు నడుస్తుండడం నన్ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. విశ్వభారతి వైస్ ఛాన్స్‌లర్ బీజేపీకి చెందిన వ్యక్తే. మతవిధ్వేష రాజకీయాలకు ఆయన సహకరిస్తూ విశ్వవిద్యాలయ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఇలాంటి విధ్వేష, సంకుచిత రాజకీయాలు బెంగాల్ మొత్తం వ్యాపించబోతున్నాయి. హిందూత్వం పేరుతో ఇలాంటి రాజకీయాలను ఎగదోసేందుకు బీజేపీ ముందుకు కదులుతోంది’’ అని అన్నారు.

Updated Date - 2020-12-29T22:00:27+05:30 IST