కోవిడ్-19పై తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఏకమైన ప్రచురణకర్తలు
ABN , First Publish Date - 2020-03-28T02:27:39+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచం పోరాడుతూ ఉంటే, ఈ మహమ్మారి గురించి ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచం పోరాడుతూ ఉంటే, ఈ మహమ్మారి గురించి ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ప్రధాన వార్తా పత్రికల ప్రచురణకర్తలు నడుం బిగించారు. బీబీసీ ఆధ్వర్యంలోని గ్లోబల్ ట్రస్టెడ్ న్యూస్ ఇనీషియేటివ్ కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన తప్పుడు, హానికర సమాచారాన్ని గుర్తించి, ఆ సమాచారం పునర్ముద్రణ కాకుండా కృషి చేస్తోంది.
ఈ ఇనీషియేటివ్లో ది హిందూ, ఫైనాన్షియల్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ఫేస్బుక్, గూగుల్, యూట్యూబ్, ట్విటర్, ఏఎఫ్పీ, మైక్రోసాఫ్ట్, రాయిటర్స్, యూరోపియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, సీబీసీ, రేడియో కెనడా ఉన్నాయి. కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని గుర్తించి, పరస్పరం తెలియజేసుకునేందుకు ఈ సంస్థలు ఓ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని ఫేస్బుక్, గూగుల్ వంటి ప్లాట్ఫామ్స్ సమీక్షిస్తాయి. ఈ తప్పుడు సమాచారాన్ని ఈ నెట్వర్క్లోని ప్రచురణకర్తలు పునర్ముద్రించకుండా జాగ్రత్తపడతాయి.
ట్రస్టెడ్ న్యూస్ ఇనీషియేటివ్ను 2019 జూన్లో ప్రారంభించారు. బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ మాట్లాడుతూ ఈ సంక్షోభ సమయంలో తాము ఇవ్వగలిగినంత అత్యుత్తమమైన, కచ్చితమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ అందజేయడం తమ అత్యవసర బాధ్యతగా బీబీసీతోపాటు ఈ ఇనీషియేటివ్లోని భాగస్వాములంతా భావిస్తున్నట్లు తెలిపారు.