కొవిడ్-19కు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ వందశాతం ఉచిత వైద్యం.. ‘మహా’ ప్రభుత్వం నిర్ణయం..

ABN , First Publish Date - 2020-05-08T17:51:54+05:30 IST

కొవిడ్-19 రోగులకు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా వందశాతం ఉచితంగా చికిత్స అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది...

కొవిడ్-19కు ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ వందశాతం ఉచిత వైద్యం.. ‘మహా’ ప్రభుత్వం నిర్ణయం..

ముంబై:  కొవిడ్-19 రోగులకు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా వందశాతం ఉచితంగా చికిత్స అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తద్వారా దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలిరాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా 10,497 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 459 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోని నాగ్‌పూర్, పుణే, నాశిక్ తదితర ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ఇవాళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే మాట్లాడుతూ.. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే కరోనా రోగులకు కూడా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. మహాత్మా జ్యోతిభా ఫూలే ఆరోగ్య బీమా పథకం కింద కొవిడ్ రోగులకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. విపత్తు సహాయక చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం కింద కరోనా రోగుల కోసం ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనని మంత్రి పేర్కొన్నారు. ఇది వరకు ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 85 శాతం వైద్య ఖర్చులు రాష్ట్రమే భరించిందనీ.. ఇప్పుడు మిగతా 15 శాతంతో కలిపి పూర్తి ఉచితంగా కొవిడ్-19 పేషెంట్లకు వైద్యం అందిస్తామన్నారు. అయితే కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు అన్యాయంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం సూచించిన చార్జీలకే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T17:51:54+05:30 IST