టీఆర్పీ స్కామ్: మీడియా దర్యాప్తును ఆపాలంటూ హైకోర్టుకు మహా సర్కారు వినతి
ABN , First Publish Date - 2020-11-26T01:22:30+05:30 IST
టీఆర్పీ రిగ్గింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సహా ఇతర న్యూస్ ఛానెళ్లు చేస్తున్న ‘‘సమాంతర దర్యాప్తు’’ను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ....

ముంబై: టీఆర్పీ రిగ్గింగ్ కేసులో రిపబ్లిక్ టీవీ సహా ఇతర న్యూస్ ఛానెళ్లు చేస్తున్న ‘‘సమాంతర దర్యాప్తు’’ను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బోంబే హైకోర్టును కోరింది. అయితే ప్రస్తుత దశలో ఈ కేసుపై రిపోర్టింగ్ చేయొద్దంటూ తాము ఆదేశాలు జారీ చేయలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ... ఈ కేసు విచారణలో ఉండగా వార్తా ఛానెళ్లు పలువురు సాక్షులను పిలిపిస్తూ, వారితో ప్రకటనలు ఇప్పిస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఓ వైపు టీఆర్పీ స్కామ్ కేసులో ముంబై పోలీసులు జరుపుతున్న విచారణపై స్టే విధించాలంటూ రిపబ్లిక్ ఛానెల్ వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా.. అదే ధర్మాసనానికి కపిల్ సిబల్ ‘‘సమాంతర దర్యాప్తు’’ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా రిపబ్లిక్ టీవీ యాజమాన్య సంస్థ ఏఆర్జీ అవుట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్లో కోరింది.