జనవరి 31 వరకూ 'మహా' ఆంక్షలు
ABN , First Publish Date - 2020-12-30T20:04:11+05:30 IST
యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని..
ముంబై: యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. లాక్డౌన్ ఆంక్షలను జనవరి 31 వరకూ పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికి ముందు డిసెంబర్ 31 వరకూ లాక్డౌన్ విధిస్తున్నట్టు నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల అనుమతి తీసుకుని తమ తమ పరిధిలో నైట్ కర్ఫ్యూను జిల్లా కలెక్టర్లు అమలు చేయవచ్చని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 'డిసెంబర్ 22 నుంచి 2021 జనవరి 5 వరకూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. ఆ ప్రకారం ఐదుగురు వ్యక్తులకు మించి ఒకచోట గుమిగూడరాదు' అని రెవెన్యూ అండ్ ఫారెస్ట్ శాఖ, డిజాస్టర్ మేనేజిమెంట్, రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ ఒక ప్రకటనలో తెలిపాయి.
కాగా, మహారాష్ట్రలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 19,25,066కు చేరుగోగా, 18,20,021 మంది డిశ్చార్చి అయ్యారు. 55,672 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 49,373కు చేరింది. రికవరీ రేటు 94.54గా ఉంది.