మహారాష్ట్ర వరదలకు కారణం కర్ణాటక జలాశయాలు కాదు : నిపుణుల కమిటీ
ABN , First Publish Date - 2020-06-19T03:10:16+05:30 IST
మహారాష్ట్రలో భారీ నష్టానికి కారణమైన 2019నాటి వరదలపై కర్ణాటకలోని
ముంబై : మహారాష్ట్రలో భారీ నష్టానికి కారణమైన 2019నాటి వరదలపై కర్ణాటకలోని జలాశయాల ప్రభావం ఏమీ లేదని మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఈ కమిటీని అప్పటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వరదల కారణంగా మహారాష్ట్రలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ స్టడీ కమిటీ (ఈఎస్సీ) సమర్పించిన నివేదికలో, కర్ణాటకలోని అల్మట్టి, హిప్పనగిరి జలాశయాలు, వాటి వరద కార్యకలాపాలు మహారాష్ట్రలోని వరద పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపలేదని అధ్యయనం సూచిస్తోందని తెలిపింది. నదీ పరీవాహక ప్రాంతాల్లో సహజమైన నీటి పారుదల వ్యవస్థను అడ్డుకుంటూ, ఆక్రమణలకు పాల్పడటం, రకరకాల అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల పశ్చిమ, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాలు 2019లో దారుణమైన వరద ప్రభావానికి గురైనట్లు తెలిపింది.