నాకు మంత్రివర్గంలో చోటు కల్పించండి..సీఎంకు సామాన్యుని సంచలన లేఖ
ABN , First Publish Date - 2020-07-08T18:57:54+05:30 IST
ఓ సామాన్య పౌరుడు సాక్షాత్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంచలన లేఖ రాశారు....

భోపాల్ (మధ్యప్రదేశ్): ఓ సామాన్య పౌరుడు సాక్షాత్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంచలన లేఖ రాశారు. తనకు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని కేబినెట్ మంత్రిగా నియమించాలని బాల్చంద్వర్మ అనే సామాన్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు. రాష్ట్ర శాసనసభలో లేని 14 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో తనను కూడా మంత్రిగా మూడురోజుల్లోగా తీసుకోవాలని కోరుతూ బాల్ చంద్ వర్మ అనే సామాన్య పౌరుడు సీఎంకు లేఖ రాశారు. లేకుంటే ఏ సభలోనూ సభ్యులు కాని 14 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని బాల్ చంద్ డిమాండ్ చేశారు. గతంలోనూ మీరు సీఎంగా పనిచేసినపుడు ఐదుగురు విధానసభ సభ్యులు కాని వారిని మంత్రులుగా నియమించారని బాల్ చంద్ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన లేఖ అందిన మూడు రోజుల్లోగా తనను మంత్రిగా నియమించాలని బాల్ చంద్ కోరారు.