మధ్యప్రదేశ్ ప్రభుత్వ మనుగడకు పరీక్ష
ABN , First Publish Date - 2020-11-03T06:50:58+05:30 IST
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే అసెంబ్లీ ఉప ఎన్నికలకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. 12 మంది మంత్రుల స్థానాలు సహా 28 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి...
- ఆ రాష్ట్రంలో నేడు 28 సీట్లకు ఉప ఎన్నిక
- వీటిలో 12 మంది మంత్రుల స్థానాలూ..
- దేశవ్యాప్తంగా మరో 26 సీట్లకూ పోలింగ్
- గుజరాత్లో 8, యూపీలో 7, కర్ణాటకలో 2
- చాలాచోట్ల గెలుపు బీజేపీకి ప్రతిష్ఠాత్మకం
భోపాల్, నవంబరు 2: మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వ భవితవ్యాన్ని తేల్చే అసెంబ్లీ ఉప ఎన్నికలకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. 12 మంది మంత్రుల స్థానాలు సహా 28 చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 25 చోట్ల బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ. మొత్తం 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలను గెల్చుకుని కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఏడాది మార్చి నెలలో జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్కు రాజీనామా చేయడం, 22 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఆయనవెంట వెళ్లడంతో సర్కారు పడిపోయింది. జ్యోతిరాదిత్య వర్గ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. తర్వాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రె్స నుంచి బీజేపీలో చేరా రు. వీరు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నిక ఫలితాలపై ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. సాధారణ మెజారిటీకి 8 స్థానాలైనా గెలవాల్సి ఉంటుంది. గుజరాత్ (8), యూపీ (7), కర్ణాటక (2), తెలంగాణ (1-దుబ్బాక), ఒడిశా, చత్తీ్సగఢ్, జార్ఖండ్, నాగాలాండ్, హరియాణల్లోని 26 అసెంబ్లీ స్థానాలకూ మంగళవారమే ఉప ఎన్నిక జరగనుంది. కాగా, యూపీ, ఉత్తరాఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూపీలో 10 స్థానాలకు ఎనిమిదింటిలో బీజేపీ పాగా వేసింది. ఉత్తరాఖండ్లో ఒక రాజ్యసభ స్థానంలో బీజేపీ గెలిచింది.