స్కూటర్- కారు ఢీ... వాహనదారుల మధ్య గొడవ... ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2020-12-19T14:23:57+05:30 IST

రోడ్డుపై వాహనాలు ఢీకొనడం... ఆ వాహనాలకు చెందినవారు రోడ్లపైనే గొడవ పడుతుండటం తరచూ చూస్తుంటాం. మధ్యప్రదేశ్‌లో...

స్కూటర్- కారు ఢీ... వాహనదారుల మధ్య గొడవ... ఊహించని విధంగా...

ఇండోర్: రోడ్డుపై వాహనాలు ఢీకొనడం... ఆ వాహనాలకు చెందినవారు రోడ్లపైనే గొడవ పడుతుండటం తరచూ చూస్తుంటాం. మధ్యప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఇదే సమయంలో ఊహించని విధంగా మరో ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే ఇండోర్‌లో కారులో వెళుతున్న సిద్ధార్థ సోనీ వాహనాన్ని వికాస్ యాదవ్ నడిపిస్తున్న యాక్టివా ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపైననే వాహనాలను ఆపివేసి, గొడవకు దిగారు. ఇంతలో అదే మార్గంలో వేగంగా వచ్చిన ఒక ట్రక్కు సిద్ధార్థ సోనీని ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 


మృతుడు సిద్ధార్థ సోనీ ఇండోర్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో పనిచేస్తుంటాడు. నాలుగు రోజుల క్రితమే అతని వివాహ వార్షికోత్సవం జరిగింది. కాగా ఈ దుర్ఘటన ఇండోర్ లోని బడ్వానీ ప్లాజా సమీపంలో జరిగింది. ఈ ఉదంతం సీసీటీవీలో రికార్డయ్యింది. దీనిలో ఉన్న ఫుటేజ్ ప్రకారం... ఉదయం 11 గంటల 13 నిముషాలకు వాహనదారుల మధ్య గొడవ ప్రారంభమైంది. 50 సెకెన్ల తరువాత వికాస్ యాదవ్... సిద్ధార్థ సోనీపై చేయి చేసుకున్నాడు. ఇంతలో సరిగ్గా 11 గంటల 14 నిముషాలకు వేగంగా వచ్చిన ఒక ట్రక్కు సిద్దార్థ సోనీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

                                                         ఎన్డీటీవీ సౌజన్యంతో...

Updated Date - 2020-12-19T14:23:57+05:30 IST