ప్యాంగాంగ్ ఫింగర్ 4 నుంచి బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ
ABN , First Publish Date - 2020-07-16T04:37:20+05:30 IST
లడక్: లడక్ ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 4 దగ్గర నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా నిరాకరిస్తోంది. ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకూ ఈ పరిస్థితి నెలకొంది.
లడక్: వాస్తవాధీన రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 4 దగ్గర నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా నిరాకరిస్తోంది. ఫింగర్ 8 నుంచి ఫింగర్ 4 వరకూ ఈ పరిస్థితి నెలకొంది. చూసుల్ వద్ద నిన్న భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య సుదీర్ఘంగా 15 గంటల పాటు చర్చలు జరిగాయి. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా తరపున మేజర్ జనరల్ లియు లిన్ చర్చలు జరిపారు. గల్వాన్తో పాటు మిగతా మూడు పాయింట్ల నుంచి ఇప్పటికే చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. అయితే ఫింగర్ 4 దగ్గర నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేందుకు చైనా నిరాకరిస్తోంది. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చేలా ఉంది. భారత్-చైనా సైనిక కమాండర్ల మధ్య ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు జరిగాయి.
జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కొన్ని పాయింట్ల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది.