మిడతల గుంపు ఎంతపని చేశాయో చూడండి..!
ABN , First Publish Date - 2020-05-28T22:15:53+05:30 IST
భారత్ను కరోనాతో పాటు మరో భయం వెంటాడుతోంది. కరోనా వైరస్ జనాన్ని టార్గెట్ చేస్తే.. మిడతల దండు పంటలను నాశనం చేయడమే...
రాజస్థాన్లో మిడతల దండు వల్ల 20 జిల్లాల్లో 90వేల హెక్టార్లలో పంట నష్టం
జైపూర్: భారత్ను కరోనాతో పాటు మరో భయం వెంటాడుతోంది. కరోనా వైరస్ జనాన్ని టార్గెట్ చేస్తే.. మిడతల దండు పంటలను నాశనం చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాయి. రాజస్థాన్లోని 20 జిల్లాల్లో 90,000 హెక్టార్లలో మిడతల దండు వల్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్, నాగూర్, జైపూర్, దౌసా, కరౌలి, మధోపూర్ జిల్లాల్లో పంటలు ఈ మిడతల గుంపు వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. ఈ మిడతల దండు తెలంగాణ వైపుగా వస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ఉత్తరాది రాష్ర్టాల మీదుగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోకి ప్రవేశించిన మిడతల దండు ఆదిలాబాద్ జిల్లా వైపుకు వేగంగా దూసుకు వస్తోంది. దీంతో సరిహద్దుల్లో ఉన్న జిల్లాకు ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే కరోనాతో అతలా కుతలమవుతున్న రైతులకు మిడతల బెడదతో కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాకు సుమారుగా 200 కి.మీల దూరంలో ఉన్న మిడతలు జిల్లాలోకి ప్రవేశిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. పది రకాలుగా ఉండే మిడత ల్లో ఎడారి మిడతలు అత్యంత ప్రమాదకరమైనవిగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అన్ని రకాల ఆకులను తినే మిడతలు పత్తి, మెక్కజొన్న, జొన్న లాంటి పంటలను బాగా ఇష్టపడతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పంటలు లేక పోవడంతో పెద్దగా నష్టం ఉండదంటున్నారు. రైతులు వేసవి దుక్కులు చేయడం, పంట పొలాలను చదును చేసుకోవడం లాంటి పనుల్లో నిమగ్నమయ్యారు.