ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు..?
ABN , First Publish Date - 2020-04-26T05:00:53+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ మే 16 వరకూ పొడిగించే అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి కచ్చితమైన సమాధానమైతే ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే దీనిపై ఉన్నతాధికారులు మాత్రం కొన్ని విస్పష్టమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ మే 16 వరకూ పొడిగించే అవకాశం ఉందా అంటే కచ్చితమైన సమాధానం దొరకని పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. ఈ నేపథ్యంలో.. కొవిడ్-19పై ఢిల్లీ ప్రభుత్వం వేసిన కమిటికి చైర్మన్గా వ్యవహరిస్తున్న డా. ఎస్ కే సారిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘భారత్లో మరికొద్ది రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతాయి. కాబట్టి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంక్షలు సడలిస్తే కరోనా మహమ్మారి మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీ.. అనేక కంటెయిన్మెంట్ జోన్లకు నెలవు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగించడమే ఉత్తమం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మే 16 తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని కూడా ఆయన తెలిపారు. ఈ అంచనాలు ప్రాతిపదిక ఏమిటని విలేకరుల ప్రశ్నించగా.. చైనా ఘటనల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని ఆయన తెలిపారు. చైనా కేసుల ఆధారంగా రూపొందించిన మ్యాథమెటికల్ అంచనాల ప్రకారం.. కరోనా మహమ్మారి అదుపులోకి రావాలంటే కనీసం 10 వారాలు పడుతుందని సారిన్ తెలిపారు.