బిహార్ ఎన్నికలు: బాంబ్ పేల్చిన చిరాగ్ పాశ్వాన్
ABN , First Publish Date - 2020-10-04T22:40:09+05:30 IST
తాజాగా జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇంతలోనే చిరాగ్ ఈ ప్రకటన చేయడం పట్ల ఎన్డీయేలో బయటికి కనిపించని కుదుపు వచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ) పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో కలిసి తాము పోటీలో ఉండడం లేదని ప్రకటించారు. తాజాగా జేడీయూ-బీజేపీ మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇంతలోనే చిరాగ్ ఈ ప్రకటన చేయడం పట్ల ఎన్డీయేలో బయటికి కనిపించని కుదుపు వచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జేడీయూతో సంబంధాలపై ఎల్జేపీ మొదటి నుంచి అసంతృప్తిగానే ఉంది. ‘మాకు జేడీయూతోనే సమస్య బీజేపీతో ఎలాంటి సమస్య లేదు’ అని చిరాగ్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతలోనే జేడీయూతో కలిసి ఎన్నికలకు వెళ్లడం లేదని చిరాగ్ ప్రకటించడం గమనార్హం.
ఆదివారం ఎల్జేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో కలిసి లోక్ జన్శక్తి పార్టీ పోటీ చేయడం లేదు. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రధానంగా ఇదే విషయమై చర్చించాం. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ కూడా దీనికే అనుకూలించింది’’ అని అన్నారు.