సరిహద్దులు దాటుతున్న మద్యం...

ABN , First Publish Date - 2020-07-19T22:09:59+05:30 IST

తెలంగాణ నుంచి మద్యం నిత్యం సరిహద్దులు దాటుతోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉండడంతో పాటు అధిక ధరల నేపధ్యంలో... మందుబాబులు సరిహద్దు దుకాణాల వైపు దృష్టి సారిస్తున్నారు.

సరిహద్దులు దాటుతున్న మద్యం...

మహబూబ్‌నగర్ : తెలంగాణ నుంచి మద్యం నిత్యం సరిహద్దులు దాటుతోంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉండడంతో పాటు అధిక ధరల నేపధ్యంలో... మందుబాబులు సరిహద్దు దుకాణాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో... సెలవు రోజు వచ్చిందంటే చాలు... దారుల్లో మందుబాబుల ప్రవాహం కనిపిస్తోంది. 


కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో... తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. వాస్తవానికి... లాక్‌డౌన్‌లో వచ్చిన నష్టాలను కొంతవరకు నింపుకుని బయటపడేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మధ్యం ధరలను పెంచాయి.


అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ రాష్ర్టంలో పెరుగుదల ఒకింత తక్కువగా ఉంది. ఈ క్రమంలో... ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.


ఈ ప్రాంతాలకు సరిహద్దు జిల్లాలైన కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు వివిధ గ్రామాల నుంచి మద్యం ప్రియులు మందు కోసం సరిహద్దులు దాటుకుని తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రత్యేకించి... సెలవు దినమైన అదివారం ఉదయం ఏడు గంటల నుంచే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వివిధ గ్రామాల మందుబాబులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి మద్యం షాపుల వద్ద క్యూలు కడుతున్నారు.


మరోవైపు... ఆంధ్రప్రాంతానికి చెందిన గ్రామీణ ప్రాంతాల వారు గ్రామాల్లో మద్యం విక్రయించేందుకు కూడా తెలంగాణ నుంచి తక్కువ ధరకు మద్యాన్ని దొంగచాటుగా తీసుకెళ్లి విక్రయాలు చేపడుతున్నారు. అయితే ఈ క్రమంలో మద్యాన్ని సరిహద్దు దాటించేందుకు మద్యం ప్రియులు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.  


ఇదే క్రమంలో... కొంత మంది ఏకంగా నదుల మీదుగా మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు కూడా. ఇక కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో అక్కడి మద్యం బాబులు మద్యం కోసం తెలంగాణ మద్యం దుకాణాలను ఆశ్రయిస్తుండడం ఇక్కడి మద్యం వ్యాపారులకు కాసుల పంట కురిపిస్తోందిది. 


Updated Date - 2020-07-19T22:09:59+05:30 IST