నితీష్ ర్యాలీలో లాలూ నినాదాలు... మండిపడిన సీఎం
ABN , First Publish Date - 2020-10-22T01:01:34+05:30 IST
వేదకపై నితీష్ ప్రసంగిస్తుండగా, లాలూ ప్రసాద్ యాదవ్ జిందాబాద్ అంటూ కొందరు వ్యక్తులు నినాదాలు..

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జనతదళ్ చీఫ్ నితీష్ కుమార్ బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో సహనం కోల్పోయారు. వేదకపై నితీష్ ప్రసంగిస్తుండగా, లాలూ ప్రసాద్ యాదవ్ జిందాబాద్ అంటూ కొందరు వ్యక్తులు నినాదాలు చేశారు. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. 'న్యూసెన్స్' చేయద్దు అంటూ వేదకపై నుంచే వారిపై మండిపడ్డారు. 'మా పార్టీకి ఓటు వేయకూడదనుకుంటే, వేయకండి. న్యూసెన్స్ మాత్రం చేయకండి' అని నితీష్ మందలించారు. ఇదే సమయంలో, నినాదాలిస్తున్న వారు చేస్తున్న పని సరైనదేనా అంటూ సభకు హాజరైన వారిని నితీష్ ప్రశ్నించారు. 'నో' అంటూ జనం కోరస్గా ప్రతిస్పందించారు.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు ఒకప్పటి మామగారైన చంద్రికా రాయ్కు జేడీయూ టిక్కెట్ ఇచ్చింది. చంద్రికా రాయ్కి ఓటు వేయాలంటూ నితీష్ వేదిక నుంచి ఓటర్లను కోరుతుండగా కొందరు వ్యక్తులు నినాదాలతో గలభా సృషించారు. వారిని సైలెంట్గా ఉండాలని నితీష్ కోరుతుండగానే, కొందరు కలుగచేసుకుని ఆ గుంపును అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఈ ఘటనపై ఆర్జేడీ నాయకుడు మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ, లాలూ ఒక అద్భుతమైన, బీహార్ ప్రజల ప్రేమను చూరగొన్న వ్యక్తి అని అన్నారు. బీహార్ ప్రజలను నితీష్ వంచించారని ఆరోపించారు.