కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా కాల్ సెంటర్లు: కేంద్రం
ABN , First Publish Date - 2020-04-14T22:50:21+05:30 IST
లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో వలస కూలీల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగంలోని వారి సమస్యలు పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 20 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది.
![కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా కాల్ సెంటర్లు: కేంద్రం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020041405154845/04142020171906n51.jpg)
న్యూఢిల్లీ: లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో వలస కూలీల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగంలోని వారి సమస్యలు పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 20 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వలస కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటు కార్మికులకు ఊరట కల్పించడమే ఈ కాల్ సెంటర్ల ప్రధాన ఉద్దేశ్యమని కార్మిక శాఖ ప్రకటించింది. ఫోన్ నెంబర్లు, ఈ మెయిళ్లు, వాట్సాప్ ద్వారా కార్మికులు ఈ కాల్ సెంటర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ఆయా ప్రాంతాల్లోని కార్మిక శాఖ అధికారులు, లేబర్ కమిషనర్లు కాల్ సెంటర్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రతి రోజు కాల్ సెంటర్ వ్యవహారాలపై సమీక్షలుంటాయని కూడా కార్మిక శాఖ తెలిపింది. కరోనా కాలంలో జీవిక కోల్పోయి అవస్థలు పడుతున్న కార్మికుల సమస్యలపై మానవత్వంతో స్పందించాలని సంబంధిత అధికారులకు కార్మిక శాఖ సూచనలు జారీ చేసింది.