తమిళనాడు సీఎం అభ్యర్థిపై త్వరలో బీజేపీ ప్రకటన

ABN , First Publish Date - 2020-12-25T16:58:02+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో

తమిళనాడు సీఎం అభ్యర్థిపై త్వరలో బీజేపీ ప్రకటన

చెన్నై : వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) తరఫున పోటీ చేయనున్న సీఎం అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానమే ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ ప్రకటించి అన్నాడీఎంకేలో మరోమారు కలకలం రేపారు. మదురై విమానాశ్రయం వద్ద గురువారం ఉదయం ఆయన మీడియా కు ఈ విధంగా ప్రకటించారు. ఇటీవల మురుగన్‌ ఇదే విధంగా వ్యాఖ్యానించడంతో అన్నాడీఎంకే నేతలు, సీనియర్‌ మంత్రులంతా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పళనిస్వామి పోటీ చేస్తారని అన్నాడీఎంకే నాయకులంతా ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి కూడా మురుగన్‌ కూటమిలో చిచ్చురేపేలా ప్రకటనలు చేయడం మానుకోవాలని, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ వైదొలగవచ్చని కూడా హెచ్చరించారు.


ఆ తర్వాత మురుగన్‌ తన ప్రకటన సవరించుకుని అన్నాడీఎంకేలో అలజడిని సద్దుమణిగేలా చేశారు. ఈ నేపథ్యంలో మురుగన్‌ మరోమారు అన్నాడీఎంకే కూటమిలో కలకలం రేపే విధంగా మాట్లాడి మళ్ళీ వివాదానికి తెరలేపారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున వెయ్యి చోట్ల అవగాహన ప్రచారం నిర్వహించినట్టు మురుగన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో డీఎంకే సమ్మె పిలుపు విజయవంతం కాలేదని, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 42 మంది రైతులపై కాల్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.


2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులు తమ ఉత్పత్తులను ఏయే ప్రాంతాల్లో విక్రయించు కోవచ్చనే వివరాలను తెలియజేసిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులోనూ ఆ విషయం ఉందన్నారు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతూ ప్రజల ను తప్పుదోవపట్టిస్తున్నారని మురుగన్‌ ఆరోపించారు. చెన్నై నగరానికి చెందిన క్రైస్తవ మతపెద్ద ఎస్రా సర్గుణం భగవంతుడికి సేవలు చేయడానికి బదులుగా డీఎంకే సభల్లో పాల్గొని ప్రధాని మోదీని ఏకవచనంతో సంబోధించడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-25T16:58:02+05:30 IST