రైతులను సంపన్నులుగా మారుస్తున్న బియ్యం ఇవే!: ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2020-12-01T00:02:30+05:30 IST
వారణాసి: బలవర్ధక ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నల్లబియ్యం( కృష్ణ వ్రీహీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారణాసి: బలవర్ధక ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నల్లబియ్యం( కృష్ణ వ్రీహీ)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్లో కృష్ణ బియ్యం పండించడం ద్వారా అనేక రైతు కుటుంబాలు సంపన్న కుటుంబాలుగా మారుతున్నాయని చెప్పారు. యూపీ వారణాసి పర్యటనలో ఉన్న ఆయన తన నియోజకవర్గం రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకువచ్చిన అత్యాధునిక మౌలికవసతుల వల్ల రైతులు ఎలా లబ్ధి పొందుతున్నారో తెలిపేందుకు ఆయన చంద్రోలి రైతుల గురించి చెప్పారు. రెండేళ్ల క్రితం చంద్రోలిలో రైతులు కృష్ణ వ్రీహీలో ఒక రకాన్ని పండించారని ప్రధాని చెప్పారు. గత ఖరీఫ్లో 400 వందల రైతులు వీటిని పండించారు. ఈ రైతుల కోసం ప్రత్యేక సమితిని ఏర్పాటు చేసినట్లు మోదీ వెల్లడించారు. మార్కెట్ కూడా సిద్ధం చేశామన్నారు.
మామూలు బియ్యం కిలో 35-40 రూపాయలకే దొరుకుతున్న చోట నాణ్యమైన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 300 రూపాయలకు అమ్ముడుపోతున్నాయని ప్రధాని చెప్పారు. విదేశీ మార్కెట్లలో కూడా నల్లబియ్యం(కృష్ణవ్రీహీ) అందుబాటులోకి రావడం గొప్పవిషయమని, తొలిసారి ఆస్ట్రేలియాకు బియ్యం పంపినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు పంపిన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 850 రూపాయలుగా నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు.
కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) అనేది ప్రాచీన భారతీయ వరి వంగడమని, సుశృత సంహితలో దీని గురించి ప్రస్తావించారని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణన్ (8686743452) తెలిపారు. కరీంనగర్ ఖాసింపేటలో ఆయన కృష్ణ బియ్యం పండిస్తున్నారు. అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేదని, వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారని కౌటిల్య తెలిపారు. జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించే గుణాలు కృష్ణ బియ్యంలో పుష్కలమని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.