కంగన తండ్రి అడగడం వల్లే వై-ప్లస్ భద్రత: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2020-09-12T21:34:12+05:30 IST
తన కుమార్తెకు భద్రత కల్పించాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం వల్లే ఆమెకు వై-ప్లస్

హైదరాబాద్: తన కుమార్తెకు భద్రత కల్పించాలని బాలీవుడ్ నటి కంగన రనౌత్ తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం వల్లే ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని కొందరి వ్యక్తుల గుండెల్లో దడపుట్టించే సామాజిక సమస్యలపై కంగన ప్రతిస్పందిస్తోందని కంగన తండ్రి పేర్కొన్నారని మంత్రి చెప్పారు.
‘‘హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్కు కంగన తండ్రి లేఖ రాశారు. తన కుమార్తె వేధింపులకు గురవుతోందంటూ ముఖ్యమంత్రిని కలిసి ఒక మెమొరాండం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు హిమాచల్ ముఖ్యమంత్రి ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు’’ అని కిషన్రెడ్డి వివరించారు. కంగన పాక్ ఆక్రమిత వ్యాఖ్యలు చేసిన తర్వాత పలువురు శివసేన నేతలు ముంబైకి రావొద్దని కంగనను బెదిరించారని, అందుకనే ఆమెకు భద్రత కల్పించినట్టు మంత్రి పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి తర్వాత మహారాష్ట్ర నాయకులకు, కంగనకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో ఇది తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమెకు వై-ప్లస్ భద్రత కల్పించింది. పదిమంది సాయుధులైన కమాండోలు 24 గంటలూ కంగనకు భద్రత కల్పిస్తున్నారు.