కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఖుష్బూ మద్దతు

ABN , First Publish Date - 2020-08-01T16:13:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఖుష్బూ మద్దతు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఖుష్బూ మద్దతు

చెన్నై(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానానికి తమిళనాడులో మద్దతుగా ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ సినీ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం సృష్టించాయి. ఖుష్బూ వ్యాఖ్యలు ఆమె రాజకీయ అనుభవ రాహిత్యానికి నిదర్శనమని, పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎంకే అళగరి. విరుచుకుపడ్డారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా ధ్వజమెత్తారు. అదే సమయంలో నెటిజన్లు ఖుష్బూ త్వరలో బీజేపీలో చేరనుందని, ఆ కారణంగానే కాంగ్రెస్‌లోనూ ఉంటూ కేంద్రప్రభుత్వం ప్రకటించిన విద్యావిధానానికి  మద్దతు పలికారంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ శుక్రవారం తన ట్విట్టర్‌లో ఓ ప్రకటన జారీ చేశారు. నూతన విద్యావిధానానికి మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలన్నీ వ్యక్తిగత అభిప్రాయాలేనన్నారు. ఆ వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఖుష్బూ వ్యాఖ్యలు ఆమె ఏదో ఆశించి చేసిన వ్యాఖ్యలుగా ఉన్నాయే తప్ప కాంగ్రెస్‌ పార్టీ నియమాలకు, అధిష్ఠానానికి మద్దతు ఇచ్చే విధంగా లేవని అళగిరి పేర్కొనగా,  స్పందించిన ఖుష్బూ మరో ట్వీట్‌ చేశారు. ఊరకనే ఉంటే గిల్లి గీపెట్టాలని అందరూ భావించడం సహజమేనని బదులిచ్చారు. టీఎన్‌సీసీ నేత అళగిరిని ధిక్కరించే ధోరణిలో ఖుష్బూ ట్వీట్‌ చేయడం పార్టీలో మరింత కలకలం రేపింది.

Updated Date - 2020-08-01T16:13:47+05:30 IST