కరోనా పీడిత దేశానికి వెళ్లిన విషయం దాచిపెట్టడంతో ఇలా..
ABN , First Publish Date - 2020-03-09T00:09:57+05:30 IST
కేరళలో ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. కొవిడ్-19(కరోనా) పీడిత దేశానికి వెళ్లిన కుటుంబం ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు.

కొచ్చి: కేరళలో ఇటీవల వెలుగు చూసిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. కొవిడ్-19(కరోనా) పీడిత దేశానికి వెళ్లిన కుటుంబం ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. విహార యాత్ర నుంచి తిరిగొచ్చాక యథాప్రకారం తమ రోజువారి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు ముణిగిపోయారు. ఈ క్రమంలో వారు కరోనా బారిన పడటమే కాకుండా వారి పొరుగు వారికి కూడా కరోనా సోకింది. కొచ్చి చెందిన ఓ జంట..తమ కుమారుడితో(22) కలసి దోహా మీదుగా ఇటలీ వెళ్లారు. ఫిబ్రవరి 29న భారత్కు తిరిగొచ్చారు. అనంతరం..అన్ని ఎయిర్పోర్టులలో ప్రయాణికులను పరీక్షిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న ప్రకటించింది. ఇంత జరుగుతున్నా ఆ కుటుంబ సభ్యులు మాత్రం తాము ఇటలీ వెళ్లిన విషయాన్ని బయటపెట్టలేదు. మార్చి 4న వారికి జ్వరం రావడంలో పఠనంతిట్టలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. కానీ ఆప్పుడు కూడా వారి యాత్ర వివరాలు బయటపెట్టలేదు. మరో రెండు రోజుల తరువాత..వీరి పొరుగింట్లో నివసించే ఇద్దరు వయోధికులు జ్వరంలో స్థానిక ఆసుపత్రిని ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే జరిగిన విషయమంతా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారందరినీ మిగతా వారికి దూరంగా క్వారంటైన్లో పెట్టారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు వృద్ధులు కూడా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి అధికారులు.. వీరిని త్వరలో కొట్టాయమ్ మెడికల్ కాలేజీకి తరలించనున్నారు. కాగా.. ఈ విషయంపై కేరళ మంత్రి కె కె శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిది పూర్తి బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ‘ వారిది బాధ్యతారాహిత్యం. కొరనా పీడిత దేశానికి వెళ్లొచ్చి ఆ విషయం దాచిపెట్టడం నేరం. జరిగిన విషయాన్ని ఈ కుటుంబ దాచిపెట్టినందుకు.. ఆరోగ్య శాఖ మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వారు ముందే అధికారులతో పంచుకుని ఉంటే కరోనా బారిన పడకుండా వారిని రక్సించ ఉండేవాళ్లం’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.