కాలుష్యంతోనే కోవిడ్ కేసుల పెరుగుదల: కేజ్రీవాల్
ABN , First Publish Date - 2020-11-13T21:23:57+05:30 IST
దేశ రాజధానిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలకు కాలుష్యమే కారణమని ఢిల్లీ ..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల పెరుగుదలకు కాలుష్యమే కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. రాబోయే 7 నుంచి 10 రోజుల్లో వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేసుల పెరుగుదలకు అతిపెద్ద కారణం కాలుష్యమేనని, ఢిల్లీలో కరోనా కేసులు పెరగక్కుండా నిరోధించినప్పటికీ కాలుష్యం పెరగడం మొదలైన తర్వాత కోవిడ్ కేసులు కూడా పెరిగాయని ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 20 నాటికల్లా పరిస్థితి అదుపులోకి తెస్తామని చెప్పారు.
'గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అదుపు చేయడానికి అన్ని చర్యలూ తీసుకున్నాం. వచ్చే వారంలో మరిన్ని చర్యలు తీసుకుంటాం. నా ఉద్దేశం ప్రకారం వారం నుంచి పది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది. కేసులు తగ్గడం మొదలవుతుంది' అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో రికార్డు స్థాయిలో మంగళవారం 104 మరణాలు సంభవించడం, మృతుల సంఖ్య 7,332కు చేరిన నేపథ్యంలో కేజ్రీవాల్ తాజా వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.67 లక్షలకు చేరింది. బుధవారంనాడు 8,593 కరోనా కేసులు నమోదు కాగా, 85 మంది మృత్యువాత పడ్డారు.