ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనకారులు రైతులు కాదు : కర్ణాటక మంత్రి
ABN , First Publish Date - 2020-12-17T16:01:02+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో

బెంగళూరు : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్నవారు రైతులు కాదని, వారు కాంగ్రెస్ కార్యకర్తలని కర్ణాటక మంత్రి ప్రభు చౌహాన్ ఆరోపించారు. యాదగిరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించరన్నారు. రైతులు తమ భూముల్లో పని చేసుకోవడానికే ప్రాధాన్యతనిస్తారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం పని చేస్తోందని, కాంగ్రెస్ మాత్రం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.
రౌడీయిజాన్ని ప్రోత్సహించడం కాంగ్రెస్ నైజమని చెప్పారు. ఇటీవల శాసన మండలిలో కూడా కాంగ్రెస్ ఇదే సంస్కృతిని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించినప్పటికీ, తాము దానిని తీసుకొస్తామన్నారు.