నోట్లను నీళ్లతో కడిగి.. దండెంపై ఆరబెడతున్నారు!
ABN , First Publish Date - 2020-04-08T16:52:52+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రూ.500 నోటుతో ముక్కు తుడుచుకున్న వీడియో ఒకటి తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

బెంగళూరు: కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో రూ.500 నోటుతో ముక్కు తుడుచుకున్న వీడియో ఒకటి తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్గా మారడంతో గ్రామీణ ప్రాంతాల్లోని జనం హడలెత్తిపోతున్నారు. కరెన్సీ నోట్లను ముట్టుకోవడానికి కూడా జనం బెంబేలెత్తుతున్న ఘటనలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. దీంతో మాండ్యాలోని మరనచకనహల్లి గ్రామస్థులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కరెన్సీ నోట్లను నీళ్లలో కడిగి ఆరబెడుతున్నారు. తమ పంటలను అమ్మగా వచ్చిన డబ్బులను ఇలా శుభ్రం చేస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అంటున్నారు. వైరల్ అవుతున్న వీడియోలతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని.. దీంతో డబ్బులను నీళ్లలో కడుగుతున్నారని స్థానికుడు ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై అధికారులను ప్రశ్నించగా... ఇది సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తామన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. భౌతిక దూరాన్ని పాటించడం, తరుచూ చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం తదితర విధానాలతో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా చూడొచ్చని చెబుతున్నారు.