ఆ పార్టీలతో అస్సలు పొత్తు పెట్టుకోం : కమల్
ABN , First Publish Date - 2020-11-03T16:40:11+05:30 IST
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, తృతీయ కూటమి ఏర్పాటే తమ ధ్యేయమని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్హాసన్ ప్రకటించారు. సోమవారం ఉదయం టి.నగర్లోని స్టార్ హోటల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు...
చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, తృతీయ కూటమి ఏర్పాటే తమ ధ్యేయమని మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమల్హాసన్ ప్రకటించారు. సోమవారం ఉదయం టి.నగర్లోని స్టార్ హోటల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల సమావేశం కమల్హాసన్ అధ్యక్షతన జరిగింది. పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయడంలో భాగంగా ఈనెల నాలుగు వరకూ జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంఛార్జులతో సమా వేశాలు జరుగుతాయని కమల్హాసన్ ప్రకటించారు. ఆ మేరకు సోమవారం ఉదయం తొలివిడత జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. దీనికి కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్, కడలూరు, నీలగిరి సహా 38 జిల్లాలకు చెందిన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులు హాజరయ్యారు.
వారంతా మాస్కులతోపాటు ఫేస్షీల్డులు కూడా పెట్టుకుని భౌతిక దూరం పాటించి కుర్చీల్లో కూర్చున్నారు. మక్కల్ నీదిమయ్యం ప్రధాన కార్యదర్శి మురుగానందం అందరికీ స్వాగతం పలికారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, ప్రచార ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమగ్రంగా ప్రసంగించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ మాత్రమే కూర్చున్నారు. తక్కిన పార్టీ ప్రముఖులు, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాలులో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. ఈ సమావేశంలో కమల్ హాసన్ ఉద్వేగంగా ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని, అందుకు తగినట్టుగా జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులంతా తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భావసారూప్యత కలిగిన రాజకీయ పార్టీలను కలుపుకుని తృతీయ కూటమిని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా అధికార అన్నాడీఎంకే పార్టీతోగానీ, ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతోగానీ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని, ద్రావిడ పార్టీలకు దూరం గానే ఉంటామని కమల్హాసన్ స్పష్టం చేశారు. వచ్చే యేడాది మక్కల్ నీదిమయ్యం నాయకత్వంలోనూ మెగా కూటమి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. ఇక రెండో విడత జిల్లా కార్యదర్శుల సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరిగింది. ఈ సమావేశంలో మదురై, ధర్మపురి, కృష్ణగిరి, సేలం, చెంగల్పట్టు, కాంచీపురం, తిరుచ్చి, మైలాడుదురై, నాగపట్టినం, పుదుకోట, విరుదునగర్, తూత్తుకుడి జిల్లాలకు చెందిన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ ప్రతి జిల్లా కార్యదర్శికి ఐదు నిమిషాలపాటు మాట్లాడేందుకు అనుమతించారు. ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక విషయాలపై కమల్హాసన్ జిల్లా కార్యదర్శులను అడిగి ఆ వివరాలను తెలుసుకున్నారు. ఈ రెండు విడతల సమావేశాల్లో ప్రధానంగా ఎన్నికల పొత్తులు, ప్రచారంపైనే సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. కొంతమంది జిల్లా కార్యదర్శులు తమ నియోజకవర్గాలలో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న అభ్యర్థుల వివరాలను కమల్కు వివరించారు. ఈ సందర్భంగా కమల్హాసన్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ అభ్యర్థి స్థానికులతో బాగా పరిచయం కలిగి ఉండాలని, అంగబలం, ఆర్థికబలం కూడా ఉండాలని తెలి పారు. జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల సూచనలు, సలహాలను పరిశీలించిన మీదటే తాను అభ్యర్థులను ఖరారు చేస్తానని కమల్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తాను చేయబోయే ప్రచారంలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న విషయాలను గురించి కూడా జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమగ్రంగా చర్చించారు.