ఇగోను పక్కనపెట్టడానికి రెడీ: కమల్హాసన్
ABN , First Publish Date - 2020-12-16T01:30:18+05:30 IST
తమిళ సినీ నటుడు రజినీకాంత్ పార్టీతో పొత్తుపై కమల్హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం ఫోన్ కాల్ దూరంలో...

చెన్నై: తమిళ సినీ నటుడు రజినీకాంత్ పార్టీతో పొత్తుపై కమల్హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఉన్నామని, తమ సిద్ధాంతాలు దగ్గరగా ఉండి.. ప్రజలకు మేలు జరుగుతుందన్న పక్షంలో అహాన్ని పక్కన పెట్టి సహకరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కమల్ వ్యాఖ్యానించడం విశేషం. తన చిరకాల మిత్రుడు రజనీకాంత్ ప్రారంభించే పార్టీతో పొత్తుపెట్టుకునే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు, ఉలగనాయగన్ కమల్హాసన్ పేర్కొన్నారు.
జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, డిసెంబరు 31న ఆ పార్టీ వివరాలను వెల్లడిస్తానని రజినీ ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టించింది. ద్రవిడ పార్టీలలో గుబులు రేపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటముల్లో అలజడి ఆరంభమైంది.