ఒక్కరి నుంచి ఆ జ్యూవెలరీ స్టోర్లో పనిచేసే 104 మందికి కరోనా..!
ABN , First Publish Date - 2020-07-07T05:29:37+05:30 IST
తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్లోని...
తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్లోని(ఎన్ఎస్బీ రోడ్) ఓ జ్యూవెలరీ స్టోర్ కరోనా హాట్స్పాట్గా మారింది. లాక్డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం షాపులు తెరుచుకోవడంతో ఎన్ఎస్బీ రోడ్లో ఉన్న ఓ ప్రముఖ జ్యూవెలరీ స్టోర్ గతంలో మాదిరిగానే తెరుచుకుంది. ఆ స్టోర్లో పనిచేసే ఓ వ్యక్తి జూన్ 22న కరోనా బారిన పడ్డాడు. మొత్తం ఆ స్టోర్లో పనిచేసే 303 మంది వర్కర్లు, అతనితో కలిసి ఉండే 32 మంది కరోనా భయంతో టెస్టులు చేయించుకున్నారు. వారి భయమే నిజమైంది. వారిలో 104 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ ఆ ఒక్క వ్యక్తి వల్ల 104 మందికి కరోనా సోకినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అతనికి కరోనా సోకినట్లు తెలిసిన వెంటనే ఐసోలేషన్లో ఉంచామని, అంతమందికి సోకుతుందని తొలుత భావించలేదని జిల్లా అధికారి తెలిపారు.
అయితే.. వారం రోజుల వ్యవధిలో ఆ జ్యూవెలరీ స్టోర్లో అతనితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో 104 మందికి కరోనా సోకినట్లు తెలిసిందని చెప్పారు. జూన్ 22న తురైయ్యూర్, ముసిరి తాలూకాల్లో నమోదైన కేసులు 10. జూలై 5న నమోదైన కేసుల సంఖ్య 108. వీటిలో 104 కేసులు ఆ జ్యూవెలరీ స్టోర్కు సంబంధం ఉన్నవే కావడం గమనార్హం. తిరుచ్చిలోని ఆ జ్యూవెలరీ స్టోర్ను 2 వారాల పాటు మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.