కాబూల్ గురుద్వారా దాడిలో సంచలన విషయం వెలుగులోకి
ABN , First Publish Date - 2020-03-27T23:59:40+05:30 IST
కాబూల్లోని గురుద్వారాపై మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో
న్యూఢిల్లీ: కాబూల్లోని గురుద్వారాపై మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో కేరళకు చెందిన 30 ఏళ్ల షాప్కీపర్ ఉన్నట్టు తేలింది. అతడు మరెవరో కాదు.. ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరేందుకు నాలుగేళ్ల క్రితం కేరళ నుంచి పరారైన 14 మందిలో అతడు కూడా ఉన్నాడు. బుధవారం కాబూల్లోని గురుద్వారాపై జరిగిన ఉగ్రదాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఒకడైన సూసైడ్ బాంబర్ అబు ఖాలిద్ అల్ హింది ఫొటోను ఐసిస్ శుక్రవారం విడుదల చేసింది.
అల్ హింది మరెవరో కాదు.. అతడి అసలు పేరు మొహమ్మద్ సాజిద్ కుథిరుల్మ్మల్. కేరళ, కసర్గడ్లోని పడ్నె ప్రాంతానికి చెందిన షాప్కీపర్. 2016లో అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది.
జూలై 2016లో కసర్గడ్కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల తన కుమారుడు అబ్దుల్ రషీద్, అతడి భార్య అయిషా(సోనియా సెబాస్టియన్), చిన్నారితో ముంబై వెళ్లాడని, గత రెండు నెలలుగా వారు కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సాజిద్ సహా మరో 14 అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో వీరంతా ఐసిస్లో చేరేందుకు వెళ్లినట్టు తేలింది. అబ్దుల్ రషీద్ సహా వారందరినీ ఐసిస్ చేర్చుకుంది.