కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్‌కు ఢిల్లీ సర్కారు బ్రేక్

ABN , First Publish Date - 2020-03-13T18:56:26+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి..

కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్‌కు ఢిల్లీ సర్కారు బ్రేక్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ మరికొన్ని నియంత్రణ చర్యలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఐపీఎల్ సహా అన్ని క్రీడాపోటీలపై నిషేధం విధించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఐపీఎల్ సహా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న అన్ని క్రీడలపైనా నిషేధం విధించాలని నిర్ణయించాం. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు సాంఘికంగా పరస్పరం దూరం పాటించడం చాలా అవసరం...’’ అని పేర్కొన్నారు. సెమినార్లు, కాన్ఫరెన్సులు సహా 200 మందికి మించి సమావేశమయ్యే ఎలాంటి కార్యక్రమాలను ఢిల్లీలో అనుమతించబోమని సిసోడియా పేర్కొన్నారు.


దక్షిణ కొరియాలో ఈ వైరస్ సోకిన 30 మందిని ప్రత్యేకంగా  ఉంచినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందడాన్ని  ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ తర్వాత 31వ వ్యక్తి మరో 10 వేల మందికి వైరస్‌ను వ్యాప్తి చేశాడు. అయితే ఢిల్లీలో ఆ పరిస్థితిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో సాంఘికంగా కొంత దూరం పాటించడమే చక్కటి పరిష్కారం...’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. కాగా ఈ నెల 31 వరకు దేశరాజధానిలోని అన్ని సినిమా హాళ్లు మూసివేయాలంటూ ఆదేశించిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Updated Date - 2020-03-13T18:56:26+05:30 IST