భారత్-చైనా బోర్డర్ వివాదంపై రాజ్నాథ్ కీలక ప్రసంగం
ABN , First Publish Date - 2020-09-17T18:57:13+05:30 IST
భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు.
![భారత్-చైనా బోర్డర్ వివాదంపై రాజ్నాథ్ కీలక ప్రసంగం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020091701222655/09172020132451n53.jpg)
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. లద్దాఖ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. 1962లో లద్దాఖ్లో చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించిందన్నారు. పాకిస్థాన్ నుంచి 5 వేల చదరపు కి.మీ. భూమిని చైనా తీసుకుందన్నారు. అరుణాచల్ప్రదేశ్లోని వేల చదరపు కి.మీ. భూభాగం తమదని చైనా వాదిస్తోందని చెప్పారు. 1988 తర్వాత భారత్-చైనా అనేక ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. 1988 నుంచి 2003 వరకు రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలను చైనా ఉల్లంఘించడం సరికాదని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్ కోరుకుంటోందని, చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్ను కవ్విస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. చైనా బలగాల కవ్వింపులను భారత్ సైనికులు సమర్థవంతంగా అడ్డుకున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ లద్దాఖ్ వెళ్లి భారత బలగాలకు భరోసా కల్పించారని చెప్పారు. చైనా బలగాల కదలికలపై నిఘా తీవ్రతరం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.