భారీ ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు : భారత సైన్యం
ABN , First Publish Date - 2020-12-13T17:19:47+05:30 IST
భారీ ఆయుధాలతో పాకిస్థాన్ కాల్పులు : భారత సైన్యం

డెహ్రాడూన్ : నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అత్యధిక సామర్థ్యంగల ఆయుధాలతో కాల్పులు జరుపుతోందని భారత సైన్యం పేర్కొంది. జమ్మూ-కశ్మీరు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జరుపుతున్న కాల్పుల సంఘటనలు పెరిగినట్లు తెలిపింది.
ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)లో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ సందర్భంగా ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సతీందర్ కుమార్ సైనీ మీడియాతో మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన సంఘటనలు గత ఏడాదితో పోల్చుకుంటే బాగా పెరిగినట్లు తెలిపారు. భారత దేశంలోని సామాన్య ప్రజలపై దాడి చేసేందుకు శక్తిమంతమైన ఆయుధాలను పాకిస్థాన్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. భారత సైనికులు కూడా అమరులవుతున్నట్లు పేర్కొన్నారు. తాము కూడా పాకిస్థాన్కు దీటుగా బదులిస్తున్నామన్నారు.
చైనా వాస్తవాధీన రేఖ వెంబడి గ్రామాలను నిర్మిస్తున్నట్లు వెలువడిన కథనాలపై లెఫ్టినెంట్ జనరల్ సైనీ స్పందిస్తూ, ఈ గ్రామాలను చైనా వైపు నిర్మిస్తున్నందువల్ల భారత సైన్యానికి ఇబ్బంది లేదన్నారు. మన భూభాగంలో కొత్తగా నిర్మాణాలను లేదా గ్రామాలను నిర్మించలేదని స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా సరిహద్దుల ఆవల చైనా వైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. కాబట్టి ఇది మనకు ఆందోళన కలిగించే అంశం కాదన్నారు.
తూర్పు లడఖ్లో భారత్-చైనా మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చల ప్రక్రియ దోహదపడుతుందన్నారు. చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 ఏప్రిల్నాటికి ఉన్న పరిస్థితి పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా దీనికి పరిష్కారం లభించాలని కోరుకుంటున్నామని, మన భూభాగం ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం కొనసాగేవిధంగా కృషి చేస్తామని అన్నారు.