భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు చల్లారుతున్న వేళ ఒక్కసారిగా ఘర్షణ
ABN , First Publish Date - 2020-06-16T20:32:34+05:30 IST
న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. లడక్ గల్వన్ లోయలో నిన్న రాత్రి రెండు దేశాలూ బలగాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో తలెత్తిన ఘర్షణలో భారత కల్నల్తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు...

న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది. లడక్ గల్వన్ లోయలో నిన్న రాత్రి రెండు దేశాలూ బలగాలు ఉపసంహరించుకుంటున్న సమయంలో తలెత్తిన ఘర్షణలో భారత కల్నల్తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా బలగాలు రాళ్లు రువ్వడంతో పాటు హింసకు పాల్పడటంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దీంతో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
రెండు వైపులా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. తమ సైనికులపై భారత జవాన్లు దాడులకు పాల్పడ్డారని చైనా ఆరోపించింది. అయితే చైనా వైపు ఎంతమంది జవాన్లకు గాయాలయ్యాయనేది ఇంకా తెలియలేదు. ఐదుగురు చైనా జవాన్లు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చైనా అధికారికంగా ప్రకటించలేదు. బలగాల ఉపసంహరణ సమయంలో భారత జవాన్లు రెండు సార్లు హద్దులు మీరి దాడులకు పాల్పడ్డారని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. వెంటనే పరిస్థితులను అదుపు చేసేందుకు రెండు దేశాల సైన్యాధికారులు చర్చలు ప్రారంభించారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. భారత బలగాల ఏకపక్ష దాడులు పరిస్థితులను దిగజారుస్తాయని చైనా హెచ్చరించింది. రెండు దేశాల మధ్య ప్రారంభమైన మేజర్ జనరల్ల చర్చలు ఉద్రిక్తతలు తగ్గించవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.