కెనడా ప్రధాని వ్యాఖ్యలకు భారత్ కౌంటర్!
ABN , First Publish Date - 2020-12-01T21:40:35+05:30 IST
భారత్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించడం పట్ల భారత్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: భారత్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అరకొర సమాచారం ఆధారంగా చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమని స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో పాత్రికేయులు కెనడా ప్రధాని ప్రస్తావన తేగా..విదేశంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు. ‘అరకొర సమాచారంతో కెనడాకు చెందని కొందరు నేతలు భారత్లోని రైతు నిరసనలపై స్పందించడం మనం చూశాం. అయితే ఇటువంటి వ్యాఖ్యలు..అది కూడా భారత్ అంతర్గత విషయాలపై చేయడం సమంజసం కాదు. అంతేకాకుండా.. దౌత్యపరమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయావసరాల కోసం తప్పుడు నిర్వచనాలు ఇవ్వడం సబబు కాదు’ అని అనురాగ్ శ్రీవాత్సవ కామెంట్ చేశారు.
కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్న ఆయన రైతులకే తమ మద్దతు అన్నట్టు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఇప్పటికే భారత ప్రభుత్వాన్ని సంప్రదించామని కూడా ఆయన చెప్పారు. దీనిపై మహరాష్ట్రలోని అధికార పక్షం శివసేన ఘాటుగానే స్పందించింది. భారత్ దేశ అంతర్గత విషయాల్లో కలుగచేసుకోవద్దని హెచ్చరించింది. తాజాగా భారత ప్రభుత్వం కెనడా ప్రధాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.