రీఫ్యూయలర్ల కొనుగోలుకు భారత్ యోచన
ABN , First Publish Date - 2020-12-07T08:17:44+05:30 IST
ఎయిర్బస్ సంస్థకు చెందిన 330 ఎంఆర్టీటీ విమానాలు ఆరింటిని భారత్ కొనుగోలు చేయనుందా..? ఆ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనకు అంగీకారం తెలపనుందా..? అవునంటున్నాయి రక్షణ శాఖ వర్గాలు...

- ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం?
న్యూఢిల్లీ, డిసెంబరు 6: ఎయిర్బస్ సంస్థకు చెందిన 330 ఎంఆర్టీటీ విమానాలు ఆరింటిని భారత్ కొనుగోలు చేయనుందా..? ఆ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనకు అంగీకారం తెలపనుందా..? అవునంటున్నాయి రక్షణ శాఖ వర్గాలు. ఈ విమానాలను మల్టీరోల్ మిడ్-ఎయిర్ రిఫ్యూయెలర్స్గా వ్యవహరిస్తారు. ఇవి ప్రధానంగా యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనాన్ని నింపేందుకు ఉపయోగపడతాయి. ఈ తరహా ఇతర విమానాలతో పోలిస్తే.. 330 ఎంఆర్టీటీ విమానాలకు ఒకేసారి రెండు యుద్ధవిమానాలకు ఇంధనం నింపే సామర్థ్యం ఉంది. అంతేకాక.. అవసరాన్ని బట్టి 260మంది సిబ్బందిని తరలింవచ్చు లేదా ఎయిర్ అంబులెన్స్గానూ వినియోగించుకోవచ్చు. అత్యవసరమైతే.. గరిష్ఠంగా ముగ్గురు సిబ్బందితో మూడింటికీ ఒకేసారి దీన్ని వాడుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ఇతర రిఫ్యూయలర్లతో పోలిస్తే ఇవి చాలా మెరుగైనవి కావడంతో భారత్ వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతోందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం భారత వాయుసేన (ఐఏఎఫ్) వద్ద రష్యాకు చెందిన ఏడు ఐఎల్-76ఎం రీఫ్యూయెలర్లున్నాయి. పాక్ వద్ద ఇదే తరహావి నాలుగు, చైనా వద్ద మూడు ఉన్నాయి. వీటి సాయంతో యుద్ధవిమానాలు మరింత ఎక్కువ సేపు గాల్లో ఎగిరేందుకు అవకాశం కలుగుతుందని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.