ఓవైపు కరోనా, మరోవైపు దురాక్రమణ

ABN , First Publish Date - 2020-08-16T08:03:32+05:30 IST

భారత్‌ ఈ ఏడాది ఒకేసారి రెండు పెను సమస్యల్ని ఎదుర్కొంటోందని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ శనివారం పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా విపత్తుతో, మరోవైపు సరిహద్దుల్లో దురాక్రమణతో భారత్‌ పోరాటం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు...

ఓవైపు కరోనా, మరోవైపు దురాక్రమణ

  • భారత్‌ ఎదుట రెండు పెను సవాళ్లు చైనాలో భారత రాయబారి


బీజింగ్‌, ఆగస్టు 15: భారత్‌ ఈ ఏడాది ఒకేసారి రెండు పెను సమస్యల్ని ఎదుర్కొంటోందని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ శనివారం పేర్కొన్నారు. ఓవైపు దేశంలో కరోనా విపత్తుతో, మరోవైపు సరిహద్దుల్లో దురాక్రమణతో భారత్‌ పోరాటం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పంద్రాగస్టు సందర్భంగా బీజింగ్‌లో ఉన్న భారతీయులను ఉద్దేశించి ఇండియా హౌస్‌లో ఆయ న ప్రసంగించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగాన్ని ఆయన చదివి వినిపించారు. ఈ సందర్భంగా చైనా లో స్థిరపడిన భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా ఆయన ప్రస్తావించారు. వీసా సమస్యల కారణంగా చైనాలోని భారతీయుల కుటుంబసభ్యులు భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ‘‘మీరు రాష్ట్రపతి ప్రసంగాన్ని విన్నారు. ఆయన చెప్పినట్లుగానే.. ఈ ఏడాది భారత్‌ ఒకేసారి రెండు సమస్యలతో పోరాడుతోంది. భారత్‌లో ఓవైపు కరోనా దాడిని, మరోవైపు సరిహద్దు సమస్యల్ని ఎదుర్కొంటున్నాం. భారతీయులు స్వాతంత్ర్యోద్యమ స మయంలో ఎదుర్కొన్న పరిస్థితివంటిదే నేడు కూడా నెలకొని ఉంది. ఓవైపు కీలక సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రభుత్వం సంస్కరణల నుంచి దృష్టి మ రల్చలేదు.  ఇదే స్ఫూర్తితో మనం ఈ సమస్యలపై విజయం సాధించగలం. మీలో చాలామంది వ్యాపారపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలుసు. అయినవారితో దూరంగా ఉంటున్నారని మాకు తెలుసు. మీకు ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు మేము ఉన్నాం’’ అని మిస్రీ స్పష్టం చేశారు.


Updated Date - 2020-08-16T08:03:32+05:30 IST