లద్దాఖ్లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-05-13T08:05:41+05:30 IST
పొరుగుదేశం చైనా మళ్లీ సరిహ ద్దు ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత పశ్చిమదేశాలేవీ చైనాను నమ్మడం లేదు. తమ ఉత్పత్తి యూనిట్లను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు...

- ఇరు వైపులా మోహరించిన బలగాలు
న్యూఢిల్లీ, మే 12: పొరుగుదేశం చైనా మళ్లీ సరిహ ద్దు ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత పశ్చిమదేశాలేవీ చైనాను నమ్మడం లేదు. తమ ఉత్పత్తి యూనిట్లను భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో వివాదాస్పదంగా ఉన్న సరిహద్దుల్లో చైనా సైన్యం రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. గతవారం సిక్కిం, లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన ప్రతాపం చూపించబోయింది. సిక్కింలో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. పిడి గుద్దులతో ఇరు వైపులా పలువురు సైనికులు గాయపడ్డారు.
స్థానిక అధికారుల మధ్య చర్చల అనంతరం ఇరువైపులా సైనికులు వెనక్కి తగ్గారు. సిక్కిం సరిహద్దుఘటన సమయంలోనే లద్దాఖ్ వద్ద కూడా చైనా వాస్తవాధీన రేఖ అతిక్రమణకు పాల్పడిందని తాజాగా బయటికి వచ్చింది. చైనాకు చెందిన హెలికాప్టర్లు గతవారం 5-6 తేదీల మధ్య లద్దాఖ్ వాస్తవాధీన రేఖ మీదకు వచ్చాయి. దాంతో భారత్ వెంటనే సుఖోయ్ 30జెట్ ఫైటర్లను పంపింది. ఆరో తేదీన ఇరు దేశాల స్థానిక అధికారుల సమావేశం జరిగినప్పుడు బలగాలు వెనక్కి తగ్గాలని రెండు దేశాలు అంగీకరించాయి. అయినా, చైనా నుంచి కార్యాచరణ కనిపించకపోవడంతో భారత్ అదనపు బలగాలను సరిహద్దుకు పంపింది. చైనా కూడా బలగాలను మోహరించింది. 2017లో జరిగిన డోక్లాం దురాక్రమణ ఘటన నుంచి ఇరు దేశాల సైనికుల మధ్య తరచుగా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.