జైలులో ఉన్న శశికళకు ఐటీ శాఖ మరో బిగ్ షాక్..!

ABN , First Publish Date - 2020-10-07T22:50:39+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగి అక్రమాస్తుల కేసులో...

జైలులో ఉన్న శశికళకు ఐటీ శాఖ మరో బిగ్ షాక్..!

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా మెలిగి అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. బినాబీ చట్టం కింద ఆమెకు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ బుధవారం ఫ్రీజ్ చేసింది. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత నివాసగృహానికి ఎదురుగా స్థలాన్ని కొనుగోలు చేసి, జయ నివాసానికి దీటుగా శశికళ భవన నిర్మాణం చేపట్టారు. రూ.300 కోట్ల విలువచేసే ఆ స్థలం కూడా శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ ఫ్రీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ బినామీ ఆస్తులన్నీ శశికళ, ఇళవరసి, సుధాకరన్ పేర్ల మీద ఉన్నట్లు ఐటీ గుర్తించింది. ఈ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు సదరు స్థలాల వద్ద ఐటీ అధికారులు నోటీసులు అంటించారు. వీకే శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌కు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


షెల్ కంపెనీలతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు. షెల్ కంపెనీలు అంటే బోగస్ కంపెనీలనీ అర్థం. మార్చి 9, 1995న శశికళ ‘శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఓ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ఈ కంపెనీ సాగించినట్లు అధికారులు గుర్తించారు. 2003-05 మధ్య కాలంలో శశికళ 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు ఐటీ శాఖ చెప్పుకొచ్చింది. మొత్తం 65 ఆస్తులను శశికళ కూడబెట్టినట్లు తెలిపింది.


అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.1674 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలతో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ.. బంధువులకు లేఖ రాసినట్టు ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంలో శశికళ తన వద్దనున్న కోట్లాది రూపాయల విలువచేసే రూ.500లు, రూ.1000నోట్లను మార్పిడి చేసుకునేలా స్థిరాస్తులు కొనుగోలు చేశారు. అంతే కాకుండా రూ.237 కోట్ల విలువైన ఆ పాత పెద్దనోట్లను పౌష్టికాహార పథకం కాంట్రాక్టరుకు రుణంగా కూడా ఇచ్చారు. ఈ వివరాలు తాము జరిపిన తనిఖీలలో వెల్లడైనట్టు ఆదాయపు పన్నుల శాఖ ప్రకటించింది.


అదే సంవత్సరం నవంబర్‌లో శశికళ వదిన ఇళవరసి కుమారుడు వివేక్‌ జయరామన్‌ నివాసగృహంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు తనిఖీలు జరిపినప్పుడు శశికళ రాసిన ఆ లేఖలను స్వాధీనం చేసుకున్నారు. శశికళ తమిళంలో తన స్వదస్తూరీతో ఆ లేఖలు రాసినట్టు కనుగొన్నారు. ఆ లేఖలను గురించి వివేక్‌ జయరామన్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించినప్పుడు ఇంటి వాచ్‌మెన్‌ వద్ద గుర్తు తెలియిని వ్యక్తులు ఇచ్చి వెళ్లారని తెలిపాడు.


ఆ లేఖలను ఎందుకు ఇంటిలో భద్రపరిచావని అడిగినప్పుడు ఆ లేఖలను గురించి శశికళతో ఫోన్‌ చేసి మాట్లాడాలనుకున్నానని, ఆ కారణంగా వాటిని భద్రపరిచానని సమాధానం తెలిపారు. నెల రోజులకు పైగా ఆ లేఖలను భద్రపరచి ఆయన శశికళతో మాట్లాడలేదని అధికారులు కనుగొన్నారు. ఇక ఆ లేఖలోని సంతకం శశికళదేనని ఆమె న్యాయసలహాదారుడు సెంథిల్‌ సైతం ధ్రువీకరించినట్టు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-07T22:50:39+05:30 IST