మద్రాస్ ఐఐటీలో ల్యాబ్, గ్రంథాలయాల మూసివేత
ABN , First Publish Date - 2020-12-15T14:40:48+05:30 IST
మద్రాస్ ఐఐటీలో కరోనా పాజిటివ్ సంఖ్య 104 కి చేరడంతో క్యాంపసులోని ల్యాబ్లు, గ్రంథాలయాలు, పలు విభాగాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు....
104కు పెరిగిన కరోనా కేసులు
చెన్నై(తమిళనాడు): మద్రాస్ ఐఐటీలో కరోనా పాజిటివ్ సంఖ్య 104 కి చేరడంతో క్యాంపసులోని ల్యాబ్లు, గ్రంథాలయాలు, పలు విభాగాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. మద్రాస్ ఐఐటీలో ఆదివారం నాడు జరిపిన పరీక్షల్లో 71 మందికి కరోనా సోకింది. మళ్లీ సోమవారం జరిపిన పరీక్షల్లో మరో 33 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఐఐటీలో కరోనా కేసుల సంఖ్య 104కు పెరగడంతో అప్రమత్తమైన ఐఐటీ అధికారులు క్యాంపస్ లోని అన్ని విభాగాలను శానిటైజ్ చేయించారు.
తమిళనాడు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో ఫైనల్ ఈయర్ విద్యార్థుల కోసం తరగతులను ప్రారంభించారు. దీంతో కరోనా ప్రబలింది. మద్రాస్ ఐఐటీ క్యాంపసులో 774 మంది విద్యార్థులుండగా, 104 మందికి కరోనా సోకింది. కరోనా వ్యాప్తికి కారణమైన మెస్ ను మూసివేశారు. మెస్ హాలును మూసివేసి ఆహారాన్ని విద్యార్థుల గదుల్లోకి ప్యాక్ చేసి అందిస్తున్నామని ఐఐటీ హాస్టల్ వార్డెన్ చెప్పారు. మద్రాస్ ఐఐటీలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కలెక్టరు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాథాకృష్ణన్ ఆదేశించారు.