కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ సంచలన అధ్యయనం.. ఒక్కొక్కరి నుంచి..
ABN , First Publish Date - 2020-03-24T20:24:07+05:30 IST
దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతున్న కొత్త కరోనా వైరస్ (సార్స్-కోవ్-2) వ్యాప్తిపై భారత వైద్య పరిశోధనా మండలి తాజా అధ్యయనంలో

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతున్న కొత్త కరోనా వైరస్ (సార్స్-కోవ్-2) వ్యాప్తిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉత్కృష్ట దశలో ఈ వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి సరాసరిన ఒకరి కంటే ఎక్కువగా (1.5 మంది వ్యక్తులకు) వ్యాపిస్తుందనీ.. అదే తీవ్ర దశలో ఒకరి నుంచి నలుగురికి వ్యాపించగలదని ఐసీఎంఆర్ అంచనా వేసింది. సాంక్రమిక వ్యాధుల లక్షణం ఆధారంగా రీప్రొడక్షన్ నంబర్ (ఆర్-నాట్) విధానంలో నిర్ణయించిన ఈ తాజాగా గణాంకాలు... ఓ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి ఎంత త్వరగా వ్యాపిస్తుందో తెలియజేస్తాయి. ఈ విలువ 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ త్వరగా అంతరించిపోతుందని అర్థం. అయితే ఇది 2 కన్నా ఎక్కువగా ఉంటే తీవ్రమైన జోక్యం లేకుండా దీన్ని నిలువరించడం కష్టం.
కాగా ‘‘భారత్లో కరోనావైరస్ 2019ను నియంత్రించడానికి అనుసరించాల్సిన ప్రజారోగ్య వ్యూహాలు- గణిత నమూనా ఆధారిత విధానం’’ పేరుతో వెలువరించిన ఈ అధ్యయనం కోసం ఫిబ్రవరి వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అప్పటికి మన దేశంలో ఇంకా కరోనా రెండో దశ ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం దేశంలో 471 మంది ఈ మహమ్మారి బారిన పడగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 శాతం మంది కరోనా అనుమానిత కేసులను మూడు రోజుల్లోగా క్వారంటైన్ చేయగలిగితే.. మొత్తం కేసుల సంఖ్యను 62 శాతం నుంచి 89 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనం చెబుతోంది.