రూ.4వేల కోట్ల స్కాంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-24T04:21:47+05:30 IST

కర్ణాటకలో 2019లో సంచలనం రేకెత్తించిన ఐఎంఏ స్కాంలో చిక్కుకున్న...

రూ.4వేల కోట్ల స్కాంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

బెంగళూరు: కర్ణాటకలో 2019లో సంచలనం రేకెత్తించిన ఐఎంఏ స్కాంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఆయన విగత జీవిగా పడి ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐఎంఏ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని అతనికి క్లీన్ చీట్ ఇచ్చారనేది విజయ్ శంకర్ పై సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ ఆత్మహత్య కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.


భారీ వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి కర్ణాటకలో రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి ఐఎంఏ జ్యూవెలర్స్ బోర్డు తిప్పేసింది. దాదాపు 50 వేల మంది డిపాజిటర్లు ఈ సంస్థపై, సంస్థ యజమాని మన్సూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలనానికి దారి తీసింది.

Updated Date - 2020-06-24T04:21:47+05:30 IST