74వేల కరోనా టెస్టింగ్ కిట్లను విరాళంగా ఇచ్చిన హెచ్యూఎల్
ABN , First Publish Date - 2020-06-04T00:23:03+05:30 IST
దేశంలో కరోనా లక్షణాలు కలిగిన రోగులకు మరింత వేగంగా పరీక్షలను చేసేందుకు అనువుగా 13 కోట్ల రూపాయల విలువైన 74,328 ఆర్టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) విరాళంగా అందజేసింది.
ముంబై: దేశంలో కరోనా లక్షణాలు కలిగిన రోగులకు మరింత వేగంగా పరీక్షలను చేసేందుకు అనువుగా 13 కోట్ల రూపాయల విలువైన 74,328 ఆర్టీ-పీసీఆర్ కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) విరాళంగా అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 28,880 ఆర్టీ-పీసీఆర్ కిట్లను అందించింది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (20,160 కిట్లు), మెట్రోపాలిస్ ల్యాబ్స్ (8,088 కిట్లు), అపోలో హాస్పిటల్స్(17,280 కిట్లు ) అందుకున్నాయి.
ఈ ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ కిట్లలో న్యూక్లియక్ యాసిడ్ డయాగ్నోస్టిక్ కిట్, శాంపిల్ రిలీజ్ రీఏజెంట్, థ్రోట్ స్వాబ్, పీసీఆర్ ట్యూబ్, శాంపిల్ స్టోరేజీ రీఏజెంట్ ఉన్నాయి. ఈ టెస్టింగ్ కిట్లకు అంతర్జాతీయ సర్టిఫికేషన్ సంస్థలైన సీఈ ఐవీడీ, యూఎస్-ఎఫ్డీఏ, ఈయూ సీఈ అనుమతులు ఉన్నాయి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్ధ భాగస్వామ్యం కలిగిన ఫైండ్ జాబితాలో చోటు సంపాదించాయి.
ఈ సందర్భంగా హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ ఎండీ, సంజీవ్ మెహతా మాట్లాడుతూ "తగినంతగా టెస్టింగ్ కిట్లు, ఇతర వైద్య సామాగ్రి సరఫరా చేయడం ద్వారా ఫ్రంట్లైన్ వారియర్స్ సమర్థవంతంగా కొవిడ్-19 వైరస్ను ఎదుర్కోగలరు. దీనికోసం మేం అందిస్తున్న కిట్లు అత్యంత కీలకమైన ప్రాంతాలలో వైరస్ నిర్థారణ పరీక్షలను ఉచితంగా చేయడంలో, కొవిడ్-19 లక్షణాలు కలిగిన రోగులకు పరీక్షలను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతునందిస్తుంది'' అని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ కిట్లతో పాటుగా మూడు కోట్ల రూపాయల విలువైన 29 వెంటిలేటర్లును హెచ్యూఎల్ విరాళంగా అందజేసింది. హెచ్యూఎల్ ఇదివరకే 5వేల సెట్ల పీపీఈ కిట్లు, 20వేల ఎన్95 మాస్కులు, 2లక్షల గ్లోవ్స్, 112 పల్స్ ఆక్సిమీటర్లు, రెండు కోట్ల రూపాయాల విలువైన 28 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లును మహారాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖకు అందజేసింది. ఈ ఉత్పత్తులను మహారాష్ట్ర, ఢిల్లీతోపాటుగా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు ఈ సంస్థ అందజేసింది.
అలాగే యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్ట్రన్స్ ఫండ్), బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్)తో భాగస్వామ్యం చేసుకుని భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకుంటుంది.